ఔప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని డీఆర్వో రాజశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన రాజకీయ పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో ఫారం-6, ఫారం-7, ఫారం-8 లకు సంబంధించి విచారణ పూర్తి చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 9 వరకు వచ్చిన క్లెయిమ్లను పూర్తిస్థాయిలో విచారించామన్నారు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందనన్నారు. కళాశాలలు ఇతర ప్రాధాన్యత గల ప్రదేశాల వద్ద ఈనెల 25న ఈవీఎంలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. నూతనంగా నమోదు అయిన ఓటర్లు ఒకే చోట 1400కు పైగా ఉంటే మరో పోలింగ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రశ్నకు సమాధానంగా డిఆర్ఓ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి భాస్కర్, పరదేశి, టీడీపీ నుంచి సురేంద్రకుమార్ వైసీపీ నుంచి ఉదయకుమార్, సూపరిండెంట్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు.