ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : ఎన్ఓసి ధ్రువీకరణ పత్రం లేకుండానే రాతి క్వారీ క్రషర్ నిర్మాణం జరుగుతన్న వైనం వెలుగుచూసింది. వేపాడ మండలం వీలుపర్తి పంచాయతీ పరిధిలో ఉన్న దుంగాడ లో రెవెన్యూ లో సర్వే నెంబరు 48లో రాతి క్వారీ క్రషర్ యాజమాన్యం పంచాయతీ నుండి ఎన్ఓసి ఆమోద పత్రము లేకుండానే పనులు జరిగిస్తోంది. ప్రభుత్వానికి, పంచాయతీకి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ రాతి క్రషర్ నిర్మాణం చేస్తుంది. దీనివల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని వారంతా ప్రమాదాల బారినపడతారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఎన్ఓసి ఆమోదముద్ర లేకుండా క్వారీ రాతి క్రషర్ పనిచేయిస్తున్న యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దుంగాడ రెవెన్యూ పరిధిలో మరి కొన్ని ప్రాంతాల్లో కూడా రాతి క్రషర్ పనులు జరుగుతున్నాయి. వాటికి కూడా ఎన్ఓసి ఆమోదపత్రములు ఉన్నాయో లేవో పరిశీలన చేయాలని పరిసర ప్రాంత వ్యవసాయదారులు కోరుతున్నారు.
పంచాయతీపరంగా ఏ అనుమతి ఇవ్వలేదు : పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి
దీనిపై వీలుపర్తి. పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి వివరణ ఇస్తూ … విధుల్లో చేరి సుమారు పది నెలలు కావస్తున్నదన్నారు. ఇంతవరకు తన వద్దకు ఈ మధ్యకాలంలో దుంగాడ రెవెన్యూ పరిధిలో రాతి క్రషర్ నిర్మాణము పొందడానికి ఏ విధమైన అనుమతులు పంచాయతీపరంగా తాను ఇవ్వలేదని స్పష్టం చేశారు.