ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపి మిత్రులను, లోపాయికారిగా మోడీతో జతకట్టిన వైసిపిని ఓడించాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మంగళగిరి సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. నేతలు మాట్లాడుతూ … ఈనెల 18వ తేదీన మంగళగిరి సిపిఐ కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు మంగళగిరి నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి జన్న శివశంకర్, గుంటూరు పార్లమెంట్ సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగే ఇండియా బ్లాక్ వేదిక పార్టీల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్ వేదిక ఏర్పాటు అయిందని అన్నారు. బిజెపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. మత విభజనతో దేశంలో మళ్లీ బిజెపి అధికారంలోకి రావడానికి మతాన్ని ఉపయోగిస్తుందని విమర్శించారు. బిజెపి అధికారంలోకివస్తే ఇక ఎన్నికలు ఉండవని మేధావులు చెబుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కూడా మారుస్తారనే ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా బ్లాక్ వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను నాయకులు వివరించారు. రాష్ట్రంలో టిడిపి, జనసేన, వైసిపి పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈనెల 18వ తేదీన జరిగే సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు వి.కఅష్ణయ్య పాల్గని ప్రసంగిస్తారని తెలిపారు. మంగళగిరి అసెంబ్లీకి ఇండియా బ్లాక్ వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి జన్న శివశంకరరావును మంగళగిరి అసెంబ్లీకి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు కు సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్ ను గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు జెవ.రాఘవులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చంగయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వైకమలాకర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నియోజవర్గ నాయకులు జాలాది జాన్ బాబు, వై వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సలీం, కంతేటి జీవన సాగర్, ఆర్ హనుమంతరావు, కె కఅష్ణ చౌదరి, కె చిక్కయ్య, కే రాధిక తదితరులు పాల్గొన్నారు.