ప్రజాశక్తి-పాలకొండ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను ఎస్పి విక్రాంత్ పాటిల్తో కలిసి సందర్శించారు. ఎన్ని రూములు ఉన్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రూట్లు ఉన్నాయని అడుగగా 35 రూట్లు ఉన్నాయని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి సమాధానం ఇచ్చారు. వాటికి 140 వాహనాలు అవసరం ఉందని తెలిపారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల నుండి ఇవిఎంలు సకాలంలో స్ట్రాంగ్ రూమ్ కు వచ్చేలా చూడాలని, నిరంతర నిఘా కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని అన్నారు. వాహనాల పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ సమయంలో వచ్చినవారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీరి వెంట తహశీల్దార్ వరహాలు, సిఐ చంద్రమౌళి, ఎస్ఐ ప్రశాంత్ కుమార్, కమిషనర్ సర్వేశ్వరరావు, ఎంపిడిఒ ప్రసాదరావు తదితరులు ఉన్నారు.పోలీసుస్టేషన్ సందర్శన సీతంపేట : ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ నిశాంత్ కుమార్, విక్రాంత్ పాటిల్ సీతంపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు వాచ్ టవర్ ను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట సిఐ చంద్రమౌళి, ఎస్ఐ జగదీష్ నాయుడు తదితరులు ఉన్నారు