ప్రజాశక్తి-రాజానగరం
రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని టిడిపి నాయకులు స్పష్టం చేశారు. జనసేన అధినేత తొందరపాటు నిర్ణయం వల్ల టిడిపికి నష్టం వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చంనాయుడుకు తేల్చి చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో రాష్ట్ర అధ్యక్షునితో నియోజకవర్గం టిడిపి నాయకులు కోరుకొండ మాజీ జడ్పిటిసి సభ్యులు వెంకటరత్నం అప్పలనరసారావు, మాజీ ఎంపిపి నూకరత్నం, మండలం అధ్యక్షుడు గండి విజయకుమార్, ఎం.అప్పా రావు తదితరులు శనివారం వినతిపత్రం అందించారు. ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణచౌదరి నాయకత్వంలో నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉందని, ఈ పరిస్థితుల్లో టిక్కెట్ను జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో జనసేనకు గెలిచే సత్తా లేదని ఇటువంటి తొందరపాటు నిర్ణయం వలన టిడిపి నాయకత్వం దెబ్బతింటుందని చెప్పారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా జనసేన పార్టీ మద్దతుగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. జనసేన గెలుపునకు సహకరించేది లేదని తెగేసి చెప్పారు. 29న నియోజకవర్గంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభకు రావడం లేదన్నారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు అచ్చంనాయుడు మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో టిడిపి నాయకత్వం అధైర్య పడొద్దన్నారు. రెండు పార్టీల అధినేతలు కలిసి నియోజకవర్గంలో అభ్యర్థుల వివరాలు ప్రకటించాల్సి ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయం ప్రకటించలేదని చంద్రబాబు సభను విజయవంతం చేయాలని మాజీ ఎంఎల్ఎ పెందుర్తి వెంకటేష్ను కోరారు.