టూరిజం హబ్ గా కడియం : మంత్రి దుర్గేష్ 

ప్రజాశక్తి-కడియం : రాష్ట్ర, దేశం నుండే కాక ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన నర్సరీల అందాలు కడియం ప్రాంతంలో మెండుగా ఉన్నాయని, వాటికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్ట మొదటిగా కడియపులంక నర్సరీలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నర్సరీల నుండి దేశ విదేశాలకు కనువిందైన మొక్కలను ఎగుమతి చేస్తున్నారని, సమగ్ర కార్యాచరణ రూపొందించి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు. నర్సరీ రైతులకు కావలసిన సాంకేతిక విజ్ఞాన పరంగా హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రాంత రైతులు స్వదేశ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనేక కొత్త రకాల వంగడాలను ఉత్పత్తి చేయడం చాలా ఆనందదాయకమని వారికి మరింత సహకారంగా ప్రభుత్వం హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా ఏర్పాటు చేసేందుకు గోదావరి అందాలు, రాజమహేంద్రవరం హేవలాక్ బ్రిడ్జి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. పిచ్చుక లంక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఓబరాయ్ సంస్థతో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, రివర్ టూరిజం వంటి వాటితో సంయుక్తంగా ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. అయితే గత ప్రభుత్వం వీటికి కేటాయించిన నిధులను పక్కదో పట్టించిందని, ఈ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయించుకొని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

➡️