ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత నిర్భంద విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు అన్నారు. బుధవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక శాఖ, ఇతర సమన్వయ శాఖల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వయస్సులో ఉన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్ట రీత్యా నేరం, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు, వ్యవస్థలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలందరికీ మంచి విద్య, స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించడం మనందరి అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని బృందాలను ఏర్పరచి పట్టణంలోని పలు ప్రాంతాలలో తనిఖీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ కె.విజయ కుమారి, డిఇఒ కె.వాసు దేవరావు, ఎంఇఒ బి.దిలీప్ కుమార్, సిడబ్ల్యుసి చైర్మన్ పి.సూర్య ప్రభావతి, కార్మిక శాఖ అధికారులు, డిసిఆర్బి సిబ్బంది, ఎన్జిఒ సభ్యులు పాల్గొన్నారు.