ప్రజాశక్తి-సామర్లకోట(కాకినాడ) : సామర్లకోట మున్సిపాలిటీ ఒకటో కో ఆప్షన్ సభ్యులుగా సీనియర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మన్యం చందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్ జే రామారావు ప్రకటించారు. గురువారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన కోఆప్షన్ సభ్యుని పదవికి ఎన్నికకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు కో ఆప్షన్ సభ్యునిగా వ్యవహరించిన సీనియర్ వైసీపీ నాయకులు దవులూరి సుబ్బారావు రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మున్సిపల్ కౌన్సిల్లో వరుసగా 20 సంవత్సరాలుగా కౌన్సిలర్గా సేవలందించిన మన్యం చందర్రావు ఒక్కరే దరఖాస్తు చేయడంతో, మన్యం ఎన్నికైనట్లు, కమిషనర్ రామారావు, చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి ప్రకటించారు. తొలుత కౌన్సిల్ సభ్యులు ఇటీవల మరణించిన వైసీపీ కౌన్సిలర్ నక్కా లలిత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పొడుగు చిట్టిబాబుల మృతికి చైర్పర్సన్ ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో కో ఆప్షన్ సభ్యుని గా మన్యం చందర్రావు పేరును వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజేస్ ప్రతిపాదించగా ,హాజరైన సభ్యులందరూ ఆమోదించారు. అనంతరం మన్యం చంద్రరావు ను చైర్ పర్సన్ మున్సిపల్ కమిషనర్లు కో ఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రమును అంద చేశారు. అనంతరం కౌన్సిల్ ఆధ్వర్యంలో మన్యం చందర్రావును కమిషనర్ ,చైర్ పర్సన్ ,వైస్ చైర్మన్లు ,కౌన్సిలర్లు పూలమాలలు దుస్సాలు వాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గోకిన సునేత్ర దేవి, వైసిపి సీనియర్ కౌన్సిలర్ ఆవాల్ లక్ష్మీనారాయణ, పితాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.