ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలు
24 గంటలపాటు రెవెన్యూ సిబ్బంది నిఘా
ఐటిడిఎ పిఒ సూర్యతేజ
ప్రజాశక్తి – ఏలూరు/కుక్కనూరు
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఇసుక ర్యాంపుల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఎం.సూర్యతేజ చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని దాచారం, వింజరం, ఇబ్రహీంపట్నంలోని రెండు రీచ్లు, రుద్రమకోట గ్రామంలో రెండు రీచ్లలో సోలార్ విధానంతో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు, రెవెన్యూ సిబ్బంది కూడా 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, వాహనాలను కూడా సీజ్ చేస్తామని ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ హెచ్చరించారు.