పోలింగ్‌ గతం కంటే మెరుగు

కలెక్టర్‌కు అభినందనలు తెలిపిన ఎపి ఎన్‌జిఓస్‌

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం గతం కంటే ఎక్కువగా నమోదైందని, స్వీప్‌ ద్వారా ఓటరుని చైతన్యం చేసి పోలింగ్‌ బూత్‌ వరకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసారని జిల్లా కలెక్టర్‌ను ఎపి ఎన్‌జిఓస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌ అభినందించారు. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎపి ఎన్‌జిఓస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు శుక్రవారం కలిసి పూలమొక్క ఇచ్చి, శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్‌ కలెక్టర్‌తో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని, ఐతే దూర ప్రాంతాలకు బస్‌ల ఏర్పాట్లు తక్కువ అయ్యాయని తెలిపారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఉద్యోగులకు ట్రైయినింగ్‌, పోలింగ్‌ రోజులకు సంబంధించి మొత్తం 5 రోజుల రెమ్యునరేషన్‌ ఇచ్చామని, ఉద్యోగ, ఉపాధ్యాయులు చాలా బాగా పని చేశారని, రాత్రి అయ్యేవరకు పోలింగ్‌ జరిగినా ఉద్యోగులు కష్టపడి పనిచేశారని, వారందరికీ అభినందనలు తెలుపుతూ, త్వరలోనే వారిని సత్కరించటం జరుగుతుందని కలెక్టర్‌ నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్‌ డిపార్ట్మెంట్‌ ఉద్యోగులు కూడా పోలింగ్‌ స్టేషన్స్‌ వద్ద పనిచేశారని వారికి కూడా రెమ్యునరేషన్‌ ఇవ్వాలని నాయకులు కోరిన పిమ్మట ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టిలో పెట్టి వారికి కూడా వచ్చేలా ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు బాగా పనిచేశారని కలెక్టర్‌ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు తాలూకా అధ్యక్షుడు గొన్నోరి శ్రీధర్‌ రాజు, కార్యదర్శి కె.సత్యనారాయణ, జిల్లా ఎన్‌జిఓస్‌ నాయకులు నోరి శ్రీనివాస్‌, మహిళా విభాగం సభ్యులు సత్య భారతి, మల్లిక, నాగమణి పాల్గొన్నారు.

➡️