ప్రజాశక్తి – గజపతినగరం : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ 72, 77, 79 పోలింగ్ బూత్లతో పాటు మరికొన్ని పోలింగ్ బూత్ల్లో ఇవిఎంలు మొరాయించాయి. దీంతో సుమారు గంటకుపైగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు పోలింగ్ కూడా మందుకొడిగా సాగింది. వచ్చిన ఓటర్లు భానుడి భగభగలకు తట్టుకోలేక గొంతు తడుపు కుందామన్న కనీసం కావలసిన మంచినీటి సదుపాయం లేక అవస్థలు పడ్డారు. పోలింగ్ సిబ్బందికి కూడా కనీస సౌకర్యాలైన మంచినీరు, మజ్జిగ, టీ, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, ఆయన సతీమణి దేవి అనురాధ, తనయుడు సాయి గురునాయుడు, కుమార్తె యామిని సింధులతో కుటుంబ సమేతంగా మండలంలోని పురిటిపెంట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని 84వ పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గంట్యాడలో తమ ఓటుని వినియోగించు కున్నారు.