ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్పల మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్, గ్రామసభలు నిర్వహించినట్లు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ …. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు నార్పల మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన బండ్లపల్లి, బి.పప్పూరులలో ఈరోజు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారని అన్నారు. ఎస్సై రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలోని ప్రధాన రహదారులలో, ముఖ్యమైన కాలనీల గుండా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనుమానితుల ఇళ్లను చెక్ చేశారు. అనంతరం గ్రామసభలు నిర్వహించి ఎన్నికల వేళ ప్రజలు ఎలా మెలగాలో సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతవరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళాలు సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు