ప్రజాశక్తి-కాకినాడ : విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక వెలుగు తీయడానికి సైన్స్ రంగోలి సహకరిస్తుందని వి.బి.వి.ఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఛైర్మన్ కంచర్ల సత్యనారాయణ అన్నారు. స్థానిక జగన్నాధపురం ఎమ్.ఎస్.ఎన్ చారిటిస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని సైన్స్ రంగోలి పోటీని నిర్వహించడం జరిగింది. దీనిలో కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ మండలలో 18 పాఠశాల నుంచి 148 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వినూత్నంగా సైన్స్ బొమ్మలు, సైన్స్ అంశాలను రంగోలి రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వి.బి.వి.ఆర్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ కంచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ రంగోలి సహకరిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్.ఎస్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాంప్రదాయ పండుగ సంక్రాంతి అని ఈ సందర్భంగా సైన్స్ రంగోలి పోటీ నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైన్స్ అంటే ఆసక్తి పెంపొందించడానికి ఇటువంటి పోటీలు సహకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.సూరిబాబు. వి.గోవిందు, జి మేరీ విజరు కుమారి, ఎం.వి.ఎస్ రామకృష్ణ, సిహెచ్ శ్రీహరిరావురావు నాయుడు, ఋషి ప్రసాద్ పాల్గొన్నారు. విజేతలకు ప్రశంస పత్రాలు, బహుమతులను అందించడం జరిగింది.