సిడిపివోకు తేల్చి చెప్పిన అంగన్వాడీలు
ప్రజాశక్తి – తుళ్లూరు : జిల్లాలో చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగల గొడుతున్నారు..అంత దూరం వెళ్ళ కూడదని చెబుతున్నాను..మీరు సమ్మె చేసుకోండి..కానీ కేంద్రాలను తెరవండని..’ సీడీపీవో ప్రసూన అనడంతో అంగన్వాడీలు,సహాయకులు ససేమిరా అన్నారు.రాజధాని ప్రాంతం తుళ్లూరు లోని బి అర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ ల వద్దకు శుక్రవారం సీడీపీవో వచ్చారు.యూనియన్ వాళ్ళతో మాట్లాడుకొని కేంద్రాలను యధావిధిగా తెరవాలన్నారు.’మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నోమార్లు విజ్ఞప్తి చేశాం.. ఫలితం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నాం.. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని’ అంగన్వాడీలు తేల్చి చెప్పారు. సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం భాగ్య రాజు మాట్లాడుతూ,సమస్యలు పరిష్కరించకుండా రౌడీ యిజం లాగా తాళాలు పగలగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. సమ్మె ఆగదని స్పష్టం చేశారు.కాగా అంగన్వాడీ ల సమ్మె శుక్రవారం నాటికి నాలుగవ రోజుకు చేరింది. సమ్మెకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు.
ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు..
అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిపారు. వినతిపత్రం అందజేశారు.