ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : స్థానిక జిల్లా గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల, బమ్మూరు వద్ద సికిల్ సెల్ నియమియా నిర్మూలన దినోత్సవం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ … ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి గాలి, నీరు, చర్మములైన వాటి ద్వారా రాదని… ఆహార అలవాట్లు వల్ల సంభవించదని జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుందని తెలియజేశారు. చికెన్ సెల్ వ్యాధి రక్తహీనతను 2023 బడ్జెట్ వద్ద ఏర్పాటుచేసి 2047 నాటికి నిర్మూలించే మిషన్ను ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో జీరో నుండి 45 ఏళ్ల మధ్య వయస్సున్న జనాభాకు అవగాహన కల్పించడం సార్వత్రిక నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్ ద్వారా ఈ వ్యాధిని అరికట్టడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్బిఎస్కె ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర మాట్లాడుతూ … సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి వారసత్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహం అని రక్తములో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులు లోపబూయిష్టంగా మారతాయని తెలియజేశారు. ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలలో హిమోగ్లోవిన్ కొడవలి కణాలుగా మారి తద్వారా ఏ భాగంలోనైనా కణజాలం, అవయవ వైకల్యానికి దారితీస్తుందని తెలియజేశారు. కొడవలి ఆకారంలో కణాలు మారడం వలన రక్తహీనత పరిస్థితులకు దారితీస్తుందని జన్యుల లోపం వలన దీనిని సికిల్ సెల్ ఎనిమియా అనే పిలవబడే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో కే ఎన్ జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి మాట్లాడుతూ … ఈ వ్యాధి వచ్చిన వారిలో రక్తహీనత కళ్ళు పసుపు రంగులోకి మారడం తీవ్రమైన ఒళ్ళు నొప్పులు కలిగి ఉండడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట తరచుగా వచ్చే అంటూ వ్యాధులు, గర్భధారణ సమయంలో సమస్యలు అవయవ నష్టం అనగా వైకల్యం కలగవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభిషేక్ రెడ్డి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ , డిపిఎంయు మాట్లాడుతూ … ఇది చాలామంది పిల్లల్లో పెద్దలలో కలిగే వీలు ఉంటుందని వీపు, కాళ్లు, చాతి మొదలైన వాటిలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయని తెలియజేశారు. వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల విరోచనాలు, జ్వరం, ఇన్ఫెక్షన్, ఒత్తిడి అలసట మొదలైనవి నొప్పి సంక్షోభాన్ని ప్రేరేపిస్తాయని దీనివల్ల శ్వాస ఆడకపోవడం, వికారంగా ఉండడం, అవయవ వైఫల్యం వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇది అత్యవసర పరిస్థితిగా గుర్తించి వెంటనే వైద్యుని సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిడమాలజిస్ట్ సుధీర్ బాబు మాట్లాడుతూ … ఈ వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని, సమతుల ఆహారం, పౌష్టికాహారం తీసుకోవాలని విపరీతమైన వాతావరణ పరిస్థితిలకు ఎదురు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పాటు చేసుకోవాలని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకూడదని తెలియజేశారు. ఈ వ్యాధిని నిర్ధారించడానికి ఎలక్ట్రోఫోరోసిస్ అనే రక్తపరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారించవచ్చని ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే ఈ పరీక్ష చేయించుకుని చికిత్స పొందినట్లయితే ఈ వ్యాధిని నివారించడం ద్వారా వారి జీవనశైలి మెరుగుపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల హెడ్ మిస్టరీస్ బి. సీత, డిప్యూటీ వార్డెన్ బి కర్రమ్మ, పిడి జి.చిన్నారావు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.