ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : యుపిఎస్సి సివిల్ సర్వీసు పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో 545 ర్యాంక్ సాధించిన అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేటకు చెందిన ఆదివాసి యువకుడు చిట్టపులి నరేంద్రపడాల్ను అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన బుధవారం సన్మానించారు. ఎంవిపి.కాలనీలోని గిరిజన భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఏజెన్సీ ప్రాంతం ఆశించినంతగా అభివృద్ధి కాలేదని, మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవారికి కష్టం విలువ తెలుస్తుందని, భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని నరేంద్ర పడాల్కు సూచించారు. అనంతరం గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొరాబు సత్యనారాయణ మాట్లాడుతూ, ఆదివాసీ యువకుడు యుపిఎస్సిలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం ఎంతో గర్వకారణంమన్నారు. ఆదివాసీల హక్కులు కాపాడేందుకు రానున్న రోజుల్లో ఆయన అధికారం గిరిజనులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఆయన విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మున్ముందు మరింత మంది గిరిజన విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నంత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర పడాల్ తండ్రి దాల్ పడల్, తల్లి విజయ భారతి, గిరిజన ఉద్యోగుల సంఘం విశాఖపట్నం వర్కింగ్ ప్రెసిడెంట్ డి.సాంబమూర్తి, కార్యదర్శి ఆర్.సత్యారావు, అధ్యక్షుడు ఎ.కోటేశ్వరరావు, సభ్యులు ఎల్.మహేంద్ర, ఒ.సింహాద్రి, కొక్కుల రామారావు, కిముడు రామారావు, ఓలేసు రామారావు, డాక్టర్ రాము, బి.తవుడన్న, కటారి శోభన్, మురాల ప్రసాద్ ఆఫీసు కార్యదర్శి గీత తదితరులు పాల్గొన్నారు.