కడప : ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం 2022ను వెంటనే రద్దు చేయాలని కడప జిల్లా కోర్టు ఎదుట గురువారం న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాది కర్నాటి భువన ఏకాదశిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూములపై యాజమాన్య హక్కులకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. భూ వివాదాలకు సంబంధించి ఈ చట్టం న్యాయ వ్యవస్థ పరిధిని, అధికారాలను దూరం చేస్తుందని, తీర్పులిచ్చే అధికారాన్ని కోర్టుల నుండి ప్రభుత్వ అధికారుల చేతుల్లోకి తీసుకువెళ్తుందని అన్నారు. ఈనెల 12న కోటిరెడ్డి సర్కిల్ నుంచి కలెక్టరేట్ బంగ్లా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయ వాదులు రామ కొండయ్య, ఏపీ న్యాయవత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సింగనమల సుమన్, రాంప్రసాద్ రెడ్డి, పి.యస్. బాల సుబ్రమణ్యం, సంపత్ కుమార్, గుర్రప్ప, ధీరజ్, వి. సురేష్ పాల్గొన్నారు.