ప్రజాశక్తి – కాకినాడ
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ నగర మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా చేశారు. జనసేనలో బీసీలకు, కష్టపడే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేస్తూ పార్టీ అధినాయకుడికి లేఖను పంపించారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి జనసేనలో పనిచేశామని, అందులో గుర్తింపు మాత్రం లేదన్నారు. జనసేనలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్, ఆయన అనుచర గణం హరిప్రసాద్, చక్రవర్తి, కేకేలతో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బిసిలకు అన్యాయం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణ మన్నారు. పార్టీ చిన్నాభిన్నం అవ్వడానికి మనోహరే కారణమని ఆయన టీడీపీకి కోవర్టుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. త్వరలోనే తన రాజకీయ కార్యాచరణను తెలియచేస్తానని అన్నారు.