ప్రజాశక్తి-కాకినాడఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం మొదలుపెట్టిన ఉద్యమంపై హర్యానా బిజెపి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం పట్ట రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రావరం నిరసన ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కన్వీనర్ రాజశేఖర్, ఐఎన్టియుసి ఎపి అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు, సామాజిక కార్యకర్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడారు. రైతాంగానికి మోడీ క్షమాపణలు చెబుతూ ఇచ్చిన హామీలు మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని, కాబట్టే రైతాంగం రెండో దఫా పోరాటానికి దిగాల్సి వచ్చిందన్నారు. పదేళ్ల కాలంలో మోడీ విధానాల ఫలితంగా 1,60,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానా బిజెపి ప్రభుత్వం ఢిల్లీకి శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతాంగంపైకి పోలీసులను ప్రయోగించి అంతర్జాతీయ సమాజం నిషేధించిన పెళ్లెట్స్ వంటి ఆయుధాలను, భాష్ప వాయు గోళాలను రైతులపై విసరబట్టే 200 మంది రైతులు గాయపడి, అనేక మంది చూపు కోల్పోయారని, ముగ్గురు రైతులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని, శుభ్ కరణ్ సింగ్ అనే యువరైతు ప్రాణాలు వదిలాడన్నారు. ఇవి సాధారణ మరణాలు కావని, మోడీ ప్రభుత్వ హత్యలని విమర్శించారు. మోడీ ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, రూరల్ కన్వీనర్ టి.రాజా, మేడిశెట్టి వెంకటరమణ, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సింహాచలం, ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తుక శ్రీను, రిటైర్డ్ పెంక్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, రాష్ట్ర కోశాధికారి సత్యన్నారాయణ రాజు, కాంగ్రెస్ యూత్ మహిళా నాయకురాలు బొజ్జా ఐశ్వర్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు, బ్యాంక్ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ జిల్లా నాయకులు కె.ఆదినారాయణమూర్తి, పెదిరెడ్ల సత్యనారాయణ, సాకా రామకృష్ణ పాల్గొన్నారు.