సీటు.. హాటు…!

Feb 26,2024 22:58
టిడిపి - జనసేన ఇటీవల

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

టిడిపి – జనసేన ఇటీవల ఉమ్మడిగా ప్రకటించిన అసెంబ్లీ స్థానాల సీట్ల వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలి జాబితాలో రెండు జనసేన, 9 టిడిపి స్థానాలను ప్రకటించగా ఆయా స్థానాల్లో టికెట్లు దక్కని పలువురు ఆశావాహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటివరకు టికెట్‌ వస్తుందని వేయికళ్లతో ఎదురుచూసిన వారంతా అనూహ్య రీతిలో మార్పులు చోటు చేసుకోవడంతో అధినేతలపై తీవ్రస్థాయిలో మండి పడుతూ వారి తీరును దుయ్యబడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా టిక్కెట్లు దక్కని నేతల కేడర్‌ అధిష్టానాల నిర్ణయాలపై తమ అభిప్రాయాలను వెళ్లడిస్తున్నారు. జగ్గంపేట, పి.గన్నవరం, పెద్దాపురం, రాజమహేంద్రవరం రూరల్‌ వంటి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్లు దక్కకపోవడంతో తీవ్రస్థాయిలో అసంతృప్తిని సామాజిక మాధ్యమాల వేదికగా వెళ్లగక్కుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొత్తు పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించాయి.జగ్గంపేటలో టిడిపి నేత జ్యోతుల నెహ్రూకి టికెట్‌ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పాఠంశెట్టి సూర్యచంద్ర గత రెండు రోజులుగా గోకవరం మండలం అచ్యుతాపురంలో అంతిమ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు టిక్కెట్‌ తనకే దక్కుతుందని ఆశతో ఎదురుచూస్తుండగా పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించడంతో భంగపడ్డారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా టిక్కెట్‌ తనకే వస్తుందని అధి ష్టానం నుంచి సంకేతాలు అందాయని, అయితే తొలి జాబితాలోనే దక్కకపో వడంతో పవన్‌ కళ్యాణ్‌ తనను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. 48 గంటల్లోగా అధిష్టానం నుంచి బుజ్జగింపులకు రాకపోతే తన భవిష్యత్తు కర్తవ్యాన్ని కార్యకర్తలతో ఆలోచించి ప్రకటిస్తానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తున్నారు. గత రెండు రోజులుగా జనసేన కార్య కర్తలతోపాటు టిడిపి నాయకులు సహా వైసిపి కార్యకర్తలు సైతం సూర్యచంద్రను పరామర్శిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా టిక్కెట్‌ దక్కించుకున్న జ్యోతుల నెహ్రూ ఇప్పటివరకు ఆయన్ను కలవకపోవడం చర్చినీయంశంగా మారింది. టిక్కెట్టు తనకు కాకుండా సూర్యచంద్రకు ఇస్తే సహకరించేది లేదని గతంలో జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. దీంతో నెహ్రూకి జనసేన నుంచి సహకారమందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సూర్యచంద్ర తన భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా వైసిపిలో చేరతారనే ప్రచారం నియోజకవర్గంలో గట్టిగా జరుగుతోంది.మరోవైపు పెద్దాపురంలోనూ అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్నాయి. మూడోసారి కూడా పెద్దాపురంలో చిన్న రాజప్పకే టికెట్‌ దక్కడంతో ఆ సీటుపై ఆశలు పెంచుకున్న జనసేన ఇన్‌ఛార్జ్‌ తుమ్మల రామస్వామి రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. చినరాజప్ప జన సైనికులు అందరికీ భరోసా ఇస్తేనే జనసేనలో కొనసాగుతాన్నారు. ఈ సందర్భంగా టికెట్‌ దక్కకపోవడంతో కార్యకర్తల ఎదుటే కన్నీరు పెట్టుకుని బోరును విలపించారు. పిఆర్‌పి నుంచి, ఆ తర్వాత జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఆస్తులు అమ్ముకుని పార్టీని నడపానని చెప్పుకున్నారు. నియోజక వర్గ కార్యకర్తలకు అధినేత పవన్‌ కళ్యాణ్‌ వచ్చి భరోసా ఇవ్వాలని లేకుంటే త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని తుమ్మల బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాకినాడ రూరల్‌లో జనసేన ఇన్‌ఛార్జ్‌ పంతం నానాజీకి టిక్కెట్‌ దక్కడంతో టిడిపి సీనియర్‌ నేత మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి ఇంటి వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. మాజీ ఎంఎల్‌ఎ భర్త పిల్లి సత్తిబాబుకు టికెట్‌ ఇవ్వాలంటూ టిడిపి కార్యకర్త ఒకరు ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా రమణయ్యపేటలోని పిల్లి సత్తిబాబు నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని టిక్కెట్‌ దక్కకపోవడంతో టిడిపికి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్యాయం చేసిన పార్టీలో కొనసాగ డానికి వీలు లేదంటూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ ఈ సందర్భంగా హెచ్చరించారు.అటు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోనూ టిక్కెట్ల రగడ కొనసాగుతోంది. కొత్తపేటలో పార్టీ బలంగా ఉన్నా టికెట్‌ కేటాయించకపోవడం సరికాదంటూ జనసేన కేడర్‌ ప్రకటిస్తున్న అసంతృప్తి తారాస్థాయికి చేరింది. జనసేన నుంచి బండారు శ్రీనివాస్‌ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న టిక్కెట్‌ కేటాయించకపోవడంతో కార్య కర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణకు టికెట్‌ దక్కకపోవడంతో ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించారు. సానుకూ లమైన నిర్ణయం ప్రకటిం చకపోతే భవిష్యత్తు కార్యా చరణ తామే ప్రకటి స్తామంటూ ఈ సందర్భంగా హెచ్చ రించినట్లు సమాచారం. అయితే వేరేచోట టికెట్‌ కేటాయించేలా ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీ పెద్దలు బాలకృష్ణకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

➡️