ప్రజాశక్తి – కాకినాడ
జిజిహెచ్ శానిటేషన్ కార్మికులు చేస్తున్న ఆందోళన సోమవారం నాటికి 24వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ మాట్లాడుతూ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని 24 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్ గాని, జిజిహెచ్ అధికారులు గాని పట్టించుకోవడంలేదన్నారు. సమస్యలను పరిష్కారం చేయకపోతే సమ్మె చేయడానికైనా కార్మికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి ఇవ్వాలని, పిఎఫ్ సొమ్ము యజమాని వాటా, కార్మికుల వాటా, రెండు వాటాలు కార్మికుల జీతం నుంచి కట్ చేస్తున్నారని ఇది చట్ట విరుద్ధమని అన్నారు. చట్టాన్ని అమలు చేయవలసిన అధికారులు చొరవ తీసుకోవటం లేదన్నారు. జిజిహెచ్ శానిటేషన్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం చేస్తే శానిటేషన్ కార్మికులకు మద్దతుగా సిఐటియు అనుబంధ సంఘాలు పోరాటానికి దిగడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్.విజరు కుమార్, జె.శేషుబాబు, ఎస్.వాసు, ఎం.రవిశంకర్, ఆర్.రమేష్, కె.పద్మావతి, ఎం.సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.