ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడి వర్కర్స్ 31 వ రోజు సమ్మెకు మద్దతుగా ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి అంగన్వాడి సమ్మె టెంట్ వరకు ర్యాలీగా వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ పట్ల ప్రభుత్వం మొండివైఖరి చాలా దారుణమన్నారు. అంగన్వాడి సమ్మె 31వ రోజుకి చేరిన ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తుందన్నారు. అంగన్వాడి వర్కర్స్ పోరాటాల చరిత్రను గుర్తు చేసుకోవాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటే ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపులు చేయడం తగదన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న నిత్యవసర ధరలు ఆకాశానంటాయని మరి జీతం పెంచమని అంటుంటే ఎందుకు అంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాదు స్కీములో పనిచేసే ప్రతి ఒక్కరికి కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించలని కనీస వేతనం అమలు చేయాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చాలని కోరారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే అంతవరకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కి ఆశా వర్కర్స్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగలి బేబీ, మలక నాగలక్ష్మి, చెక్కల వేణి,రత్న కుమారి, వరలక్ష్మి, బి వరలక్ష్మి, సుగుణ, నవ కుమారి తదితరులు పాల్గొన్నారు.
![anganwadi workers strike 31day in kkd](https://prajasakti.com/wp-content/uploads/2024/01/anganwadi-workers-strike-31day-in-kkd.jpg)