ప్రజాశక్తి – పెద్దాపురం : తమ సమస్యల పరిష్కారం కోసం,వేతనాల పెంపుదల కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం 6వ రోజుకు చేరుకుంది.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు)ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్దకు అంగన్వాడి కేంద్రాల నుండి సేవలు పొందుతున్న లబ్ధిదారులు వచ్చి అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగనవాడి కేంద్రాల ద్వారా తాము ఎన్నో సేవలు పొందుతున్నామన్నారు.వారి సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు దాడి బేబీ మాట్లాడుతూ ఆరు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు సరి కదా నిర్బంధాలను ప్రయోగించి అణచాలని చూస్తుందన్నారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి అమలు చేయాలని,అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని కోరుతుంటే ప్రభుత్వం నుండి కనీస స్పందన కూడా లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.సమ్మె శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపిన తల్లులకు, మహిళలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమల,ఎస్తేరు రాణి, నాగమణి,, వరలక్ష్మి, ఫాతిమా,కుమారి,స్నేహా,వనకుమారి, వసంత,లోవ కుమారి,లలిత, స్నేహలత, టీ యల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
![kkd aganwadi workers strike 6th day](https://prajasakti.com/wp-content/uploads/2023/12/kkd-aganwadi-workers-strike-6th-day.jpg)