రాజోలులో జనసేనాని ఎవరో..

Feb 19,2024 22:35
రాజోలులో జనసేనాని ఎవరో..

ప్రజాశక్తి-రాజోలురాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది.. సర్వేలు అన్నీ తనకు సానుకూలంగా ఉన్నాయని, తనకే అవకాశం దక్కుతుందని ఒకరు, అధినేత ఆశీస్సులు తనకే ఉన్నాయని, తానే గెలిచే అభ్యర్థిని అని మరొకరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గానికి, జనసేన పార్టీకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే జనసేన పార్టీ గెలిచిన ఏకైన స్థానం రాజోలు. ఈ ప్రాంత ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రుణపడి ఉన్నానని పలుమార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలిచి అధికార వైసిపి గూటికి పరోక్షంగా వెళ్లిపోయిన ఎంఎల్‌ఎను తిరిగి అదే జనసేన పార్టీ అభ్యర్థి ఓడించేందుకు రాజోలు నియోజకవర్గంలో జనసైనికులు కంకణం కట్టుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనతో రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీలో పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.గొల్లపల్లి అమూల్యకి టికెట్‌ ఇస్తే…!రాజోలు నియోజక వర్గంలో 2019 జనసేన గెలిచిన స్థానం. ఎస్‌సి, ఒసి (కాపు) సామాజిక వర్గాని చెందిన ఎక్కువ ఒటర్లు రాజోలులో ఉన్నారు. టిడిపి కంచు కోటగా ఉన్న ఈ నియోక వర్గంలో గత పదేళ్లుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలులో పాగా వేశారు. దీంతో ఇటీవల రాజోలు టికెట్‌ టిడిపికి ఇవ్వాలని అధిస్టానం దృష్టికి తీసుకువెళ్లారు. 2019లో జనసేన గెలిచిన స్థానం కావడంతో టిడిపి ఆశలు వదులుకుంది. దీంతో గొల్లపల్లి సూర్యరావు కుమార్తె గొల్లపల్లి అమూల్యకు రాజోలు జనసేన టికెట్‌ కెటాయిస్తే గెలుపు సునాయాసం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమూల్య భర్త బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం నుండి మెజారిటీ ఓట్లు తెచ్చుకుంటుదన్న ధీమా జనసేన క్షేత్రస్థాయిలో ఉంది. గొల్లపల్లి అభిమానులు ఆ సామాజిక వర్గ ఒటర్లు, జనసేన ఓటర్లు మెజారిటీ ఓట్లు దక్కించుకునే అవకాశం అమూల్యకు ఉంది. దీనిపై క్లారిటీ వచ్చే వరకూ రాజోలులో టికెట్‌ కోసం పాట్లు తప్పెలా లేవు.జనసేన టికెట్‌ కోసం తీవ్ర పోటీ…!ఈ నియోజకవర్గ నుంచి జనసేన పార్టీ నుంచి ముగ్గురు టికెట్‌ రేసులో ఉన్నార. మాజీ మంత్రి, రాజోలు మాజీ ఎంఎల్‌ఎ గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్య జనసేన తీర్థం పుచ్చుకుని మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే జనసేన అధిస్టానం, ముఖ్య నాయుకులతో అమె మంతనాలు జరిపారు. రాజోలు నియోజకవర్గంలో చింతలమోరి గ్రామ సర్పంచ్‌ రాపాక రమేష్‌ బాబు తనకే సీటు వస్తుందని అంటున్నారు. రమేష్‌ బాబు వైద్య వృత్తిలో ఉండి స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కోవిడ్‌ సమయంలో రాజోలు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. రాజోలుకే చెందిన రిటైర్డ్‌ ఐఎఎస్‌ దేవ వరప్రసాద్‌ చంద్రబాబు ప్రభుత్వంలో పని చేశారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరొకరు బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసి అనంతరం జనసేన పార్టీలో చేరారు. తనకే కచ్చితంగా సీటు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీని గెలిపించి తీరుతామని కంకణం కట్టుకుని జనసైనికులు పనిచేస్తున్నారు. సీటు అవకాశం దక్కితే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏ సమీకరణాల్లో సీటు కేటాయిస్తారో అనేది వేచి చూడాల్సిందే. వైసిపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు తనకే టికెట్‌ ఇచ్చారని ప్రచారం మొదలుపెట్టారు.

➡️