- ఆందోళనలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి అభ్యర్థులు
ప్రజాశక్తి-కష్ణాప్రతినిధి
స్వతంత్ర అభ్యర్థులకు, పలు ఇతర పార్టీల అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం…టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతల్లో గుబులు రేపుతోంది. ఈ కూటమి నేతలు గాజు గ్లాసు గుర్తును చూపుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్టిర్, కృష్ణాజిల్లాల్లో పలువురు అభ్యర్థులకు గాసు గ్లాసు గుర్తును కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు చింతపల్లి మనోహర్, వల్లభనేని వంశీకష్ణమోహన్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఎన్టిఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ నవతరం పార్టీ అభ్యర్థి కృష్ణ కిషోర్, విజయవాడ సెంట్రల్ ఆంధ్రరాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి శ్రీ ఫణిరాజ్కు, తూర్పు అఖిల భారత జైహింద్ పార్టీ అభ్యర్థి కె.దశరథ్కు, మైలవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్కు, జగ్గయ్యపేట స్వతంత్ర అభ్యర్థి బేరోతుల ప్రకాశరావులకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అవగాహన లేని జనసేన ఓటర్లు టిడిపికి వేయాల్సిన ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేస్తారని, తమ పార్టీకి ఇది నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.