కార్మికులకు అండగా నిలిచే సిపియంను గెలిపించండి 

Apr 6,2024 13:27 #gannavaram, #Krishna district

ప్రజాశక్తి-గన్నవరం : కార్మికుల సమస్యలపై సమరశీలంగా పోరాటం చేస్తూ.. పేదలకు ఏ సమస్య వచ్చిన ముందు నిలబడే సిపిఎంను గెలిపించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నిడమానూరు గ్రామంలోని సివిల్ సప్లై గోదాముల్లో పనిచేస్తున్న కార్మికులను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్ళం వెంకటేశ్వరరావు కలిసి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారని తెలిపారు. ప్రభుత్వ రంగం అనేది ఉండదని, ఉద్యోగులు, కార్మికుల బ్రతుకులు రోడ్డున పడతాయని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వాన్ని, టిడిపి కూటమి పార్టీలను, వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వానికి పార్లమెంటు స్థానాలు 370 దేశాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారని అదే జరిగితే రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దానిని కాపాడుకోవాలంటే బిజెపి మోడీ ప్రభుత్వం గద్దెదింపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. గన్నవరం నియోజకవర్గంలో కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందు పీటన నిలబడి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారని తెలిపారు. సిపిఎం జిల్లా నాయకులు ఎం.హరిబాబు మాట్లాడుతూ.. దేశాన్ని బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తుందని, దళితులు మైనార్టీలు క్రిస్టియన్స్ బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని అన్నారు. ప్రజా సమస్యల పని చేసే కమ్యూనిస్టులకు అండగా ఉండాలని తెలిపారు. పేదల సమస్యలు తెలుసుకొని వారి కోసం పోరాడే సిపిఎం నాయకులకు మద్దతు తెలపాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ.. సియం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విషయంలో నోరు మెదపడం లేదని, గత ప్రభుత్వం చేసిన అనేక పొరపాట్లతో అనేక సమస్యలు పెండింగ్లో పడ్డాయని తెలిపారు. బీజేపీపై పోరాడే కమ్యూనిస్టులు, లౌకిక శక్తులకు మద్దతు ఇవ్వాలని, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమంలో సిపిఎంను బలోపేతం చేయాలని కోరారు. కార్మికులు అందరూ కమ్యూనిస్టులకు మద్దతుగా నిలవాలన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు ముజఫర్ ముఠా కార్మికులతో మాట్లాడి సీపీయం కు మీ అమూల్యమైన ఓటు వేసి గన్నవరం నియోజకవర్గంలో కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ప్రజల నుండి సిపిఎంకు మద్దతు పెరుగుతుందని మహిళల నుండి రోజురోజుకు ఆదరణ లభిస్తుందని గన్నవరం అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️