ప్రజాశక్తి-ఆదోని : గిరిజనులను చితకబాది అవమానించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మునిస్వామి, తిక్కప్ప, ఆవాజ్ కమిటీ పట్టణ జాయిన్ సెక్రటరీ అజీమ్ ఖాన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అసోసియేషన్ పట్టణ కార్యదర్శి రవి, ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదోని పట్టణం పరిధిలో శ్రీనివాస్ భవన్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు కెవిపిఎస్, ఆవాజ్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు బావిలోని మంచినీళ్లు తాగారని చేతులు కట్టేసి తల్లిదండ్రుల ముందే చితకబాదడం దారుణమన్నారు. రాజ్యాంగంలోని కుల, మతం లేని అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో చట్టాలు కల్పించడం జరిగిందన్నారు. చట్టాలను సామర్థవంతంగా అమలు చేయకుండా, పాలకులు, ప్రభుత్వాలు యంత్రాంగం నీరు కారుస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే స్పందించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.