సాలూరు : మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రూ.21వేల వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తూ శుక్రవారం ప్రభుత్వ ఆదేశాలను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. పెరిగిన వేతనానికి సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా కార్మికుల విజయోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం సాలూరు పట్టణంలో చేపట్టారు. అనంతరం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వై నాయుడు, సాలూరు కమిటీ అధ్యక్షులు రాముడు, శంకర్రావు కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ముందుగా కేక్ కట్ చేసి కార్మికులకు విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమైన సమస్యల్లో జీతం సమస్య పరిష్కరించినప్పటికీ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసేదానిలో హామీ నెరవేర్చలేదని, కావున భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు పురపాలక సంఘాల్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యను పరిష్కరించే దిశగా వారి వారి మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ మహిళా నాయకులు ఇందూ, సీత, స్వప్న, కమిటీ నాయకులు రవి, శ్రీను, వెంకట్రావు, సామయ్య తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/muncipal.jpg)