ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రామలింగాయపల్లి గ్రామంలో పిడుగుపడి మృతి చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు తెలిపారు. పిడుగు పాటుకు గురై మృతి చెందిన సుంకన్న, రామేశ్వరి మృతదేహాలను సోమవారం ఉదయం సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎం.పి.. తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … పిడుగు పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందడం బాధాకరమన్నారు.. వర్షాకాలంలో పొలాలకు వెళ్లే రైతులు, ఆవులు, గొర్రెలు కాచే కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యం తో జరిగిన ఈ ఘటన పై జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఎం.పి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/knl-death-case.jpg)