ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని రాయగడ జమ్ము పంచాయితీలో పరిధిలో గల రాయగడ జమ్ము, గొరడ, పెంగవ, వల్లాడ గ్రామాల్లో నాబార్డ్ సహకారంతో జట్టు ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్న జీవా కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు వచ్చిన అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ రేఖ ఎమ్ గోనాల్ రైతులు అమలు చేస్తున్న ప్రకతి వ్యవసాయ విధానాలు చూసి అభినందించారు. సమీకృత వ్యవసాయ విధానాలు, చిరుధాన్యాలు సాగు, శ్రీ వరి, శ్రీ రాగి, పలుపంటల విధానాలు, అంతర పంటల సాగు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, ఫార్మ్ పాండ్, అజోల్లా సాగు, దేశీ కోళ్లపెంపకం, పశు మూత్ర సేకరణ శాలలు, బయో రిసోర్స్ సెంటర్, రైతు సేవా కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్ మొదలైనవి సందర్శించి రైతులను అభినందించారు. ఈ కార్యక్రమాలను రాబోవు కాలంలో అందరూ కొనసాగించాలని, పర్యావర ణాన్ని కాపాడుకోవడంలో సహజ వనరులు సంరక్షించుకోవడంలో ప్రకృతి వ్యవసాయ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. నాబార్డ్ డి.డి.ఎమ్ టి.నాగార్జున మాట్లాడుతూ జట్టు ట్రస్ట్ జీవా పైలెట్ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, రైతులు వీరి సేవలను వినియోగిం చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ రైతులు తాడంగి బంగార్రాజు, పువ్వల ఈలె, పువ్వల సావిత్రమ్మ లను అభినందించారు. అందరూ వీరిలా పంటల సాగు చేయాలని సూచించారు. వాసన్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎల్ సన్యాసి రావు మాట్లాడుతూ జట్టు ట్రస్ట్ వినూత్నమైన కార్యక్రమాలు రైతులకు అందిస్తుందని, రైతుల ఆదాయాభివృద్ధిలో వీరి సేవలు ఆదర్శంగా నిలుస్తాయని, ప్రకృతి వ్యవసాయంలో పశుసంపద అవసరం చాలా ఉందని అన్నారు. కార్యక్రమంలో జట్టు ట్రస్ట్ ఇడిప్రాహారాజ్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ తాడంగి జమ్మయ్య, కోడైరక్టర్ నూకంనాయుడు, కమల కుమారి, జీవా కో ఆర్డినేటర్ ప్రభోదు, గొల్లు మురళీ మోహన్, రైతులు, జీవా – ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.