ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ చదరంగం పోటీలను ఈనెల 27 28 తేదీలలో గురు నానక్ కాలనీ గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ తాడిపర్తి కిషన్ బాబు తెలిపారు. విభాగంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు సంబంధించి గోడ ప్రతులను శనివారం కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ చదరంగ పోటీలకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి సుమారుగా 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఈ పోటీల్లో పాల్గొని క్రీడాకారులకు, తల్లిదండ్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన తొలి నలుగురు క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు, అంతేకాకుండా గెలుపొందిన క్రీడాకారులకు, చిన్నారులకు 50 వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని చెప్పారు. వీటితో పాటు వివిధ ఏజ్ గ్రూపులలో బాల బాలికలకు ట్రోఫీలు మెడల్స్ సర్టిఫికెట్స్ ఇస్తున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి అక్బర్ పాషా, మందుల రాజీవ్ తెలిపారు. వివరాలకు 9246181858 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.