ప్రజాశక్తి – వన్టౌన్ : ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని రెడ్క్రాస్ సోసైటీ ఎన్టీఆర్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ జీ.సమరం అన్నారు. రెడ్క్రాస్ సోసైటీ, కెబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఓటు అవగాహనా ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ సమరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం భారతదేశమన్నారు. 144 కోట్ల జనాభా కలిగిన దేశంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియను నిర్వహించి ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం ఈ దేశం గొప్పతనమన్నారు. అటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు పునాది వంటిందని చెప్పారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవటం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందన్నరు. జిల్లా యువజన సర్వీసుల శాఖ జిల్లా అధికారి, స్వీప్ నోడల్ ఆఫీసర్ యు.శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తతను తొలగించి ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విస్తత ప్రజా భాగస్వామ్యం అవసరమన్నారు. ఓటరుకు సమస్త సమాచారంతో క్యూఆర్ కోడ్ ఓటర్ ఇన్ఫరేషన్ స్లిప్ (వీఐఎస్) అందిస్తున్నట్లు తెలిపారు. తొలుత ర్యాలీని కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎల్ఎన్.రెడ్డి, నగరపాలక సంస్థఅడిషనల్ కమిషనర్ కీర్తి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ పీవోలు డీ.పవన్కుమార్, ఎన్.సాంబశివరావు, కల్మబేగం తదితరులు పాల్గొన్నారు.