మూడోసారి తలపడుతున్న కళావతి, జయకృష్ణ
ప్రజాశక్తి-పాలకొండ : నియోజకవర్గంలో పాత ప్రత్యర్థుల మధ్యే ఈసారి కూడా పోటీ ఉండనుంది. వైసిపి తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి బరిలో ఉండగా, ఎన్డిఎ కూటమి అభ్యర్థిగా జనసేన తరపున నిమ్మక జయకృష్ణ బరిలో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన జయకృష్ణపై వైసిపి అభ్యర్థి గా విశ్వాసరాయి కళావతి పోటీ చేసి గెలుపొందారు. 2014 లో 1600 ఓట్ల తేడాతో కళావతి గెలుపొందగా, 2019 ఎన్నికల్లో 19000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మూడోసారి కూడా వైసిపి నుంచి కళావతి పోటీలో ఉండగా, కూటమి తరపున సీటు జనసేనకు కేటాయించారు. చివరిలో జయకృష్ణ పార్టీలో పోటీని తట్టుకుని జనసేన తరపున సీటు సంపాదించుకున్నారు. ఈసారి కూడా వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇరువురు కూడా వీరఘట్టం మండలానికి చెందిన నాయకులే కావడం గమనార్హం. కళావతి వండువ గ్రామానికి చెందిన వారు కాగా, జయకృష్ణ అదే మండలంలో ఎం.రాజపురం గ్రామానికి చెందినవారు.