ప్రజాశక్తి- చీపురపల్లి, గుర్ల : మండలంలో చెదురుమధురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చీపురుపల్లి నియోజకవర్గంలో 80శాతం పోలింగ్ జరిగింది. గతంలో కంటే ఆశాజనకంగా ఓటింగ్ శాతం పెరిగింది. కొత్తఓటర్లు పోలింగ్లో పాల్గొనడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని అంచనా వేశారు. గుర్ల మండలంలోని పెద్దబంటుపల్లి కోటగండ్రెడు గ్రామాల్లో ఇవిఎంలు మొరాయించడం వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో క్యూలో నిలబడటానికి ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించిన బొత్సచీపురుపల్లి: నియోజకవర్గంలో జరుగుతున్న ఓటింగ్ సరళిని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. స్థానిక బాలుర, రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులతో బొత్స మాట్లాడారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలను టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు సందర్శించారు. పోలింగ్లో పాల్గొన్న ఓటర్లుతో ఆయన మాట్లాడారు. విజయనగరం కూటమి ఎమ్పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు బాడంగి హెడ్ కోర్టర్లో పోలింగ్ బూత్ని పరిశీలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న 90 ఏళ్ల వృద్దుడు90 ఏళ్లు వయసున్న కిల్లంశెట్టి రామాంజనేయులు అనే విశ్రాంత ఉపాధ్యాయుడు తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. చీపురుపల్లి పట్టణానికి చెందిన ఆయన తన కుమారుడు సహాయంతో బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబరు 139లో తానే స్వయంగా ఎంపి అభ్యర్ధికి, ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఓటు వేశారు. విజయనగరం ఎమ్పి బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో గల 140వ పోలింగ్ బూత్లో కుటుంభ సభ్యులతో కలసి వెల్లి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, టిడిపి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున స్థానిక గురుకుల పాఠశాలలో ఉన్న 142వ పోలింగ్ బూత్లో తమ ఓటును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో 136వ పోలింగ్ బూత్లో తన ఓటు వేశారు.