ఉల్లంఘనపై కౌన్సిల్ ప్రతినిధులు దృష్టి పెట్టాలి
డిఎస్ఎన్యు ప్రధమ ఉపకులపతి సత్యనారాయణ
ప్రజాశక్తి- సీతమ్మధార : గ్రామాలలో కుల, సామాజిక, లింగ వివక్షతో మహిళా వివక్షతపై మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు దృష్టి సారించాలని దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ ప్రథమ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ అన్నారు. ఆదివారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మానవ హక్కుల కౌన్సిల్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ అధ్యక్షతన మానవహక్కులపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామాలలో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సమాన న్యాయం జరిగినప్పుడే హక్కుల పరిరక్షణ సాధ్యమన్నారు. సభకు అధ్యక్షత వహించిన కౌన్సిల్ కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులంతా చట్టాల పట్ల, మానవ హక్కుల పట్ల అవగాహన కలిగి, సమాజంలో వాటి ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయాలని సూచించారు.. మానవ హక్కుల పత్రిక ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఎఎస్పి ఎస్ దివాకర్, వైజాగ్ ఫిల్మ్స్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు, సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సన్ మూర్తి, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవరా సత్యనారాయణ తదితరులు షార్ట్ ఫిలిమ్స్ తిలకించి, సమీక్ష చేశారు. ప్రదర్శించిన మూడు షార్ట్ ఫిలిమ్స్ జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ బహుమతులు పొందాయని తెలిపారు.కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు ఎస్వి.రమణ స్వాగతోపన్యాసం చేయగా, డాక్టర్ వాసిని వందన సమర్పణ చేశారు కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు విఎన్ మూర్తి, సాగర్ అప్పారావు, అబ్దుల్, రెడ్డి మాట్లాడారు.
మాట్లాడుతున్న ప్రొఫెసర్ సత్యనారాయణ