ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం పట్టణంలో సిపిఎం శ్రేణులు నిర్వహించిన ర్యాలీతో మన్యం ప్రాంతం ఎరుపెక్కింది. వందలాది మంది గిరిజనులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఎర్రజెండా చేతబట్టి ర్యాలీలో పాల్గొనడంతో ఆయా ప్రాంతాలు అరుణారుణం అయ్యాయి. ఎల్విన్ పేట నుంచి గుమ్మ లక్ష్మీపురం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణతో పాటు పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, సిహెచ్ నర్సింగరావు, సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అడుగడుగునా మహిళలు వారికి పూలమాలతో స్వాగతం పలికారు. డబ్బు కళాకారుల వాయిద్యాలు, యువతి, యువకుల గిరిజన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.