ఆందోళన చేస్తున్న తపాలా ఉద్యోగులు
హిందూపురం : తపాలా శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తపాలా శాఖ కేంద్ర కమిటీ యూనియన్ పిలుపు మేరకు తపాలా సిబ్బంది పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వారు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతు రోజుకు (జిడిఎస్లకు) 8 గంటలను పని దినంగా పరిగణించాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం చెల్లించాలని, సీనియారిటీ ఇంక్రిమెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ప్రతి తపాలా ఉద్యోగి సమ్మెలో పాల్గొని విజయం సాధించేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అబ్దుల్ మునాఫ్, నరసింహులు, ప్రభాకర్, నాగరాజు, జనార్దన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి క్రైమ్ : గ్రామీణ తపాల ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెబాట పట్టారు. ఈ మేరకు మంగళవారం స్థానిక గోకులంలోని తపాలా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగులు అల్లా బకాష్, ప్రసాద్, మౌలాలి, భారతి, నాగరాజు జనరల్ సెక్రెటరీ, జనార్ధన, మునఫ్ తదితరులు పాల్గొన్నారు.