ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
హిందూపురం : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని జిల్లా జాయింట్ కలెక్టర్ చేతన్ అన్నారు. శనివారం ఓటర్ల అవగాహన కార్యక్రమం సందర్భంగా స్వీప్ యాక్టివిటీ ర్యాలీను జేసీ చేతన్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి గుండా ఆర్టీసీ బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు స్పెషల్ క్యాంపెయిన్ డేలను శని, ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరుపుకుంటున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. నూతన ఓటరుగా నమోదుకు ఫారం-6, మరణించిన వారి వివరాలను ఓటర్ జాబితా నుండి డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తొలగింపునకు ఫారం-7, ఓటరు కార్డులో ఏమైనా మార్కులు, చేర్పులు ఉంటే ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ఓటరుగా ఎక్కడ నమోదైయ్యామో అనే సమచారానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా ఎన్వీఎస్పీ వెబ్ సైట్ లేదా 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కానీ తెలుసుకోవచ్చునని తెలిపారు. ఓటరు క్యాంపెనింగ్ డేలో ఆయా పోలింగ్ స్టేషన్లో బిఎల్ఒలు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని 58, 59, 60, 63, 74, 75 పోలింగ్ స్టేషన్లలను పరిశీలించి బిఎల్ఒల రిజిస్టర్లను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ స్వర్ణలత, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ఎంపీడీవో నరేంద్ర, సెరికల్చర్ ఏడీ సురేష్, ఎంఇఒ గంగప్ప, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ రెడ్డి శేఖర్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.