విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మక్బూల్
కదిరి అర్బన్ : ఏప్రిల్ 1న కదిరి పర్యటనకు వస్తున్న సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని కదిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటవ తేదీన 3 గంటలకు పట్టణానికి రానున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలుకుతామన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పట్టణంలో రోడ్ షో ప్రారంభించి వేమారెడ్డి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం పాల్గొంటారన్నారు. ఈ సభకు వైసిపి శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. బహిరంగ సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు పివిఆర్ గ్రాండ్లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో సిఎం జగనన్న పాల్గొంటారన్నారు. టిడిపి నాయకుడు మాట్లాడినట్టు తన సొంతూరు బెంగళూరు కాదని తాను ఇక్కడే పుట్టి పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని ఇక్బాల్ అన్నారు. ఇక్కడే తన సన్నిహితులు, బంధువులు ఉన్నారన్నారు. ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సిపాయిల పని చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి, రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ సమన్వయకర్త ఎస్ఎమ్డి. ఇస్మాయిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జిలాన్బాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.