సబ్సిడీ విత్తన వేరుశనగను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
కదిరి టౌన్ : రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కదిరి పట్టణ పరిధిలోని కుటాగుల రైతు భరోసా కేంద్రంలో రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ కాయల పంపిణీని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో రైతులకు బిందు, తుంపర సేద పరికరాలను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తిరిగి వాటిని పున్ణ ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా రైతాంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని సమస్యలు పరిష్కరించడంలో పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకుంటామని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందజేసి భూసార పరీక్షలు చేసే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. రైతన్నలకు మేలు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేనా పార్టీ ఇన్ఛార్జి భైరవ ప్రసాద్ , మండల కన్వీనర్ చెన్నకేశవలు, కౌన్సిలర్లు సావిత్రమ్మ, ఫయాజ్ అలీఖాన్, ఆల్ఫా ముస్తఫా, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, మహిళా నాయకురాలు పర్వీన్ భాను, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.