అణిచివేయాలని చూస్తే ప్రభుత్వానికి పతనము తప్పదు

Dec 16,2023 12:12 #Sri Satya Sai District
atp anganwadi strike 5th day atmakuru

ఆత్మకూరు మండల కేంద్రంలో అంగన్వాడీలు వంటావార్పు
సిఐటియు జిల్లాకార్యవర్గ సభ్యులు నాగేంద్ర కుమార్

ప్రజాశక్తి-ఆత్మకూరు : అంగన్వాడి వర్కర్లు చేపట్టిన సమ్మెను అణిచివేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని సిఐటియు జిల్లా జనరల్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు.అంగన్వాడి వర్కర్స్,హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆత్మకూరు మండల కేంద్రాలలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగించారు. తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో అంగన్వాడీలు సమస్యల సాధన కోసం వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్ష శిబిరం వద్దకు చేరుకొని సిఐటియు జిల్లా జనరల్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ 5 రోజులు పాటు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు విధులు నిర్వహించకపోతే రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం మానుకొని వారి న్యాయమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అణిచివేసేందుకు కుట్ర పడడం సమంజసం కాదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లను హెల్పర్లను భయాందోళన గురి చేసే విధంగా ఎంపీడీవో పంచాయతీ సెక్రటరీలు ఏపీఎంలు పోలీసులు సచివాలయ సిబ్బందితో అంగన్వాడి సెంటర్ల తాళాలను పగలగొట్టి నిరంకుశంగా పాలన సాగిస్తే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. మండల స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారులు వారికి కేటాయించిన పనులు చేయలేక సతమతమవుతుంటే కలెక్టర్లు ఒత్తిడితో అంగన్వాడి సెంటర్లను నిర్వహించాలని ఉద్యోగులను మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఇబ్బందులను సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని,గత ఆరు నెలల నుండి పెండింగ్లో పెట్టిన సెంటర్ అద్దెలు,టిఏ బిల్లులు తక్షణం చెల్లించాలని,ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి,రాజకీయ జోక్యాన్ని నివారించాలని,మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు,ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలనుండి జగన్ ప్రభుత్వం దూరం పెట్టిందని, జీతాలు చెల్లించేటప్పుడు మాత్రం మీకు ప్రభుత్వానికి సంబంధం లేదంటూ వ్యవహరిస్తుందని విమర్శించారు.పిల్లలకు,బాలింతలకు నాణ్యతలేని బాలామృతం,గుడ్లు,చిక్కీలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం మానేసి,విజిట్ల పేరుతో ఫుడ్ కమిషనర్,అధికారులు అంగన్వాడీలను వేధిస్తున్నారన్నారు.ఫేస్ రికగ్నైజేషన్ యాప్ (ఎఫ్.ఆర్.ఎస్) వచ్చాక అంగన్వాడీ సెంటర్లో పిల్లల పౌష్టికాహారం పని పక్కకుపోయి బాలింతలు చుట్టూ ఇళ్లకు, హాస్పిటల్స్ చుట్టూ అంగన్వాడీలు తిరగాల్సివస్తుందన్నారు.తక్షణ అన్ని యపులను కలిపి ఒకే యాప్ చేయాలన్నారు. 2017 నుండి టీఏ బిల్లులు చెల్లించికపోతే ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. ఆయాల ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయి ప్రభుత్వ నిబంధనల అమలుకోసం ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలియచేశారు.పక్కనున్న రాష్ట్రాలలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిన కర్ణాటక,తెలంగాణ ప్రభుత్వాలు అధికారాలు కోల్పోవాల్సిన పరిస్థితినీ గుర్తు చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని లేనిపక్షంలో రాజ్యాంగం కల్పించిన పోరాడే హక్కుద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హైద్వా మండల కార్యదర్శి రాజేశ్వరమ్మ మధ్యాహ్నం భోజనం జిల్లా కార్యదర్శి జయమ్మ అంగన్వాడి వర్కర్లు ఆయాలు పాల్గొన్నారు

➡️