సమస్యను వివరిస్తున్న రైతులు
హిందూపురం : హిందూపురం పట్టణంలోని పరిగి బస్టాండ్ లో ఉన్న మార్కెట్ లో రైతుల నుండి సుంకం వసూలు చేయడంలో సంబంధిత కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఉత్పత్తి చేసిన వివిధ కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు వాహనాలలో తీసుకువస్తే సంబంధిత కాంట్రాక్టర్ ఒక్కొక్కరు నుండి ఒక్కో విధంగా సుంకం వసూలు చేస్తూ రైతులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని విమర్శి:చారు. ఒక వాహనానికి రూ. 80 నుండి రూ. 120 దాకా నిబంధనలకు వ్యతిరేకంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన మహిళ వ్యాపారులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకుని ఏ వాహనం నుండి ఎంత సుంకం వసూలు చేయాలన్న గెజిట్ నోటిఫికేషన్ బహిరంగపరచి, మార్కెట్ ముందు బోర్డ్ ఏర్పాటు చేయాలని రైతులు ఆదినారాయణ, రాజప్ప, హరీష్, కిష్టప్ప, చంద్రప్ప తదితరులు డిమాండ్ చేశారు.