కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
హిందూపురం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని విద్యాశాఖ అధికారులు అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాద్యాక్షులు బాబావలి డిమెండ్ చేశారు. శనివారం పట్టణంలోని బిసి వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబావలి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్, ప్రయివేట్ విద్యా సంస్థలు దోపిడీ ప్రారంభించి, 2024-25 విద్యా సంవత్సరం ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికి వారిపై కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు. లక్షలాది రూపాయాలను ఫీజుల రూపంలో తీసుకుంటూ తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు స్పందించి కార్పొరేట్, ప్రయివేటు విద్యా సంస్థల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్, జస్వంత్, పవన్, ఉదరు, హేమంత్, సంతోష్, సురేష్, ధనుష్, తిరుమలేష్, రఘు, కిరణ్ పాల్గొన్నారు.