మాట్లాడుతున్న వికలాంగుల శాఖ ఎడి కవిత
వికలాంగుల శాఖ ఎడి కె.కవిత
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల, తపన, ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.కవిత అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి ఆధ్వర్యాన క్లబ్ సభ్యురాలు కె.ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా 50 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కారణాలతో అవయవాలను కోల్పోయిన వికలాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. వికలాంగులు తమ కాళ్లపై తాము నిలబడి పనులు చేసుకునేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ ఇంజినీర్ కె.ఎన్.ఎస్.వి ప్రసాద్ మాట్లాడుతూ ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేయడం గొప్ప విషయమన్నారు. వికలాంగులకు కృత్రిమ చేతులు, కాళ్లు పంపిణీ చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కరణం శోభారాణి, కార్యదర్శి ఆర్.శ్రీనివాసరావు, కోశాధికారి అప్పలనాయుడు, జోనల్ చైర్పర్సన్ చింతాడ కృష్ణమోహన్, సభ్యులు పాలిశెట్టి మధుబాబు, సాహుకారి నాగేశ్వరరావు, డాడీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత ప్రభాస్ సూర్య, గ్రీన్ సిటీ అధ్యక్షులు మణిశర్మ, న్యూ బ్లడ్ బ్యాంకు శ్రీకాకుళం మణికంఠ తదితరులు పాల్గొన్నారు.