పెన్షన్ను అందజేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్
సామాజిక పింఛన్ల పెంపుపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఏటా పెన్షన్ పెంచుతూ రూ.మూడు వేలు ఇస్తున్నామన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలూ కొనసాగుతాయని చెప్పారు. విపక్ష నేత చంద్రబాబుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తెలియదన్నారు. అధికారం వచ్చే వరకు ఒక మాట, వచ్చాక మరో మాట చంద్రబాబు చెప్తారని విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగిస్తున్న ఏకైక నేత జగన్ అని కొనియాడారు. ఆర్థిక భారం అయినా సంక్షేమ పథకాల అమలును అడ్డుకున్న దాఖలాల్లేవన్నారు. ఒడిశాతో వివాదం నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా హిరమండలం గొట్టాబ్యారేజీ దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేసి వేసవికి వంశధార నీరు అందించవచ్చని చెప్పారు. ఇందుకోసం సిఎం జగన్ రూ.185 కోట్లు మంజూరు చేశారని, ప్రస్తుతం సంబంధిత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచిందన్నారు. అటువంటి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ధర్మాన రామ్ మనోహర్నాయుడు, వైసిపి రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, శ్రీ శయన కార్పొరేషన్ చైర్మన్ డి.పి దేవ్, ఎంపిపి అంబటి నిర్మల, తహశీల్దార్ వెంకటరావు, వైసిపి మండల అధ్యక్షులు చిట్టి జనార్థనరావు, ఎఎంసి చైర్మన్ మూకళ్ల తాతబాబు, సర్పంచ్ ఆదిత్య నాయుడు, ఎంపిటిసిలు బగ్గు అప్పారావు, నక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు.