శిబిరంలో కూర్చున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
సమగ్ర శిక్ష, విద్యాశాఖల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవదిక సమ్మెలో భాగంగా జ్యోతిరావుపూలే పార్కు వద్ద ధర్నా శిబిరాన్ని ఆదివారం కొనసాగించారు. ఈ శిబిరాన్ని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎపిటిఎఫ్-1938 జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరకొర వేతనాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని తక్షణమే ఉద్యోగభద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా సమగ్ర శిక్ష సేవలు అరకొరగా అందుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం అన్యాయమన్నారు. ఎపిటిఎఫ్ -257 సంఘం రాష్ట్ర కౌన్సిలర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ సమగ్రశిక్ష ఉద్యోగుల న్యాయసమ్మతమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి, సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పేడాడ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సమ్మెకు దారితీసిందన్నారు. కార్యక్రమంలో యుటిఎప్ ఆమదాలవలస మండల ప్రదాన కార్యదర్శి టి.పారారావు, విశ్రాంత ఉపాధ్యాయులు రమణ, తిరుమలరావు, ఎపిటిఎఫ్ జిల్లా కార్యవర్గం అనిల్బాబు, బొడ్డేపల్లి మహేష్, సుందరరావు, రాజేశ్వరరావు, అయ్యప్ప మధుసూదనరావు, చినబాబు, చంద్రశేఖర్, అమ్మి నాయుడు, రమేష్ గౌరీశ్వరరావు, సుధాకర్, అప్పారావు నాయుడు మాట్లాడారు. శిబిరంలో సమగ్ర శిక్షా శ్రీకాకుళం జెఎసి అధ్యక్షులు పైడి మురళీకృష్ణ, జెఎసి ప్రధాన కార్యదర్శి తవిటినాయుడు, శ్రీనివాసరావు శివ, అరుంధతి, విమల కుమారి తదితరులు పాల్గొన్నారు.