పరామర్శిస్తున్న ఐద్వా నాయకులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
తోటి మహిళలలే మంగమ్మపై దౌర్జన్యానికి పాల్పడి అవమానవీయ ఘనటకు పాల్పడడం దారుణమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి, నగర కన్వీనర్ శ్రీదేవి పాణిగ్రహి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.లలిత, సూర్యుడమ్మ డిమాండ్ చేశారు. బాధితురాలు మంగమ్మను ఆదివారం పరామర్శించారు. నగరంలోని దమ్ముల వీధికి చెందిన ఆరుగురు మహిళలు నవభారత్ కూడలి వద్ద నివాసముంటున్న దాసరి మంగమ్మ అనే మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెను తీవ్రంగా కొట్టి వివస్త్రను చేసి హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇరు గ్రూపులను కూర్చుని సామరస్యపూరిత వాతావరణంలో మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన సమస్యను ఆవేశాలకు పోయి నిరాశ్రయురాలిగా ఉందన్న కారణంతో కొందరు మహిళలపై దాడులకు తెగబడటం దారుణమన్నారు. పరారీలో ఉన్న నిందితులు అల్లుబిల్లి రాధతోపాటు ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.