శ్రీకాకుళం అర్బన్ : మాట్లాడుతున్న ఇన్ఛార్జి కలెక్టర్ నవీన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
క్రీస్తు శాంతి బోధనలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన క్రిస్మస్ హైటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తన బాల్యం క్రిస్టియన్ స్కూల్లోనే సాగిందని అన్నారు. అందువల్ల క్రైస్తవ బోధనలపై తనకు పూర్తి అవగహన ఉందన్నారు. ఎదుటివారిని ప్రేమించడం, నిశ్వార్థమైన ప్రేమ, కలిగి ఉండడం క్రీస్తు భోదనల్లో ప్రధానమైనవన్నారు. పాస్టర్ల ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు డియస్ వియస్ కుమార్ మాట్లాడుతూ క్రీస్తు బోధనల సారాంశాన్ని ప్రతిఒక్కరూ మనన చేసుకోవాలన్నారు. క్రైస్తవులకు శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని జాన్ జీవన్ కోరారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి కేండిల్స్ను వెలిగించారు. అలాగే జిల్లాలోని పాస్టర్లకు దుశ్శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ జి.జయదేవి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి టి.చంద్రశేఖర్, డాక్టర్ కృపానందం, అలజంగి నవీన్కుమార్, ప్రేమ్ కుమార్, దానియేలు, జయరాజ్ పాల్గొన్నారు.కవిటి: సర్వమత సమ్మేళనం మన సంస్కృతని జనసేన నాయకుడు లోళ్ల రాజేష్ అన్నారు. కవిటి కళ్యాణి ఆంగ్ల పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిందుమాధవి, బల్లెడ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.టెక్కలి: సమాజంలో అన్ని కులాలు, మతాలు అందిస్తున్న బోధనలు ఒక్కటేనని, సర్వమత సామరస్యాన్ని విద్యార్థి దశనుంచే చాటాలని రవీంధ్రభారతి పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ అన్నారు. పాఠశాల ఆవరణలో క్రిస్మస్ వేడుకలను శనివారం విద్యార్థులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే మనం అనుసరించే విధానాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.పట్టణంలోని ఓక్లాండ్ పాఠశాల్లో నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు సందడి చేశారు. మేరీమాత వేషదారణ, శాంతా క్లాస్, వేషధారణలతో విద్యార్థులు ఆలరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధులత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.