సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ నవీన్
రబీకి సాగునీరు సాధ్యం కాదు
జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు షెడ్యూల్ ఇవ్వడం అంటే నాణ్యతా పరీక్షలకు సిద్ధం కావడం తప్ప వెంటనే కొనుగోలు జరగవని, రెండు మూడు రోజుల సమయం పడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం సంబంధిత సాంకేతిక నిపుణుల ఫోన్ నంబర్లను ఆర్బికె సిబ్బందికి అందుబాటులో ఉంచాలన్నారు. జలుమూరు, సారవకోట, కోటబొమ్మాళిలో ఎక్కువ ధాన్యం సిద్ధంగా ఉన్నందున మిల్లర్ల నుంచి అదనంగా బ్యాంకు గ్యారంటీలను తీసుకోవాలని సూచించారు. పలాస, రణస్థలం, పొందూరు, హిరమండలం, కవిటి, కంచిలి మండలాల్లో ఇంకా కేంద్రాలు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిపిఎస్ పరికరాలు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్బికెకు కేటాయించిన రిజిస్టర్ వాహనాలు అన్ని కాకుండా రెండు మూడు వాహనాలే తిరిగినట్లు గుర్తిస్తే వాటి ఆపేయాలని మిగిలిన వాహనాలకు అనుమతి ఇవ్వాలని సూచించారు.రబీలో డిసెంబర్, జనవరి కీలకమని, కాలువల ద్వారా విడిచిపెడుతున్న నీటిని చెరువుల్లో మాత్రమే నింపాలని చెప్పారు. జలవనరుల శాఖ ఎస్ఇ సుధాకర్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీలో నారాయణపురం ఆయకట్టు నీరు ఇవ్వలేమని చెప్పారు. మడ్డువలస ద్వారా మూడు ఎకరాల వరకు నీరిస్తామని తెలిపారు. సమావేశంలో డిసిఎంఎస్ ఛైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శిమ్మ నేతాజీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.శ్రీధర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు ఎస్ఇ డోల తిరుమలరావు, జిల్లా ఉద్యాన అధికారి ప్రసాద్, డిఎస్ఒ వెంకటరమణ, జలవనరుల శాఖ ఎస్ఇ పొన్నాడ సుధాకర్, పశు సంవర్థక శాఖ జెడి కిషోర్, డ్వామా పీడీ చిట్టిరాజు, రైస్మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వాసు, పలువురు ఎడిలు తదితరులు పాల్గొన్నారు.