మాట్లాడుతున్న చైర్పర్సన్ విజయ
జెడ్పి చైర్పర్సన్ విజయ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆదేశించారు. జెడ్పి సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన శనివారం స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వేసవి కారణం గా ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇటీవల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ప్రారంభించిన ఉద్దానం ప్రాజెక్టు పరిధిలో అందిస్తున్న తాగునీరు నిరాటంకం గా సరఫరా చేయాలన్నారు. విద్యాశాఖను సమీక్షిస్తూ జిల్లాలో నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మార్చివేసిందన్నారు. ప్రతి పాఠశాలలో నూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఫర్నిచర్, ఇతర ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. రాత్రి వేళల్లో వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో వాచ్మె న్లను నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 6వ స్థాయీ సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన సిరిపురపు జగన్మోహనరావు ఎస్సి. కార్పొరేషన్, సాంఘిక సంక్షేమం, బిసి సంక్షేమం, బిసి కార్పొరేషన్ వికలాంగులు, నెడ్క్యాప్ తదితర శాఖల ప్రగతిని సమీక్షించారు. 3వ స్థాయీ సంఘ సమావేశంలో పశుసంవర్థక, వ్యవసాయ, మత్స్య, పట్టుపరిశ్రమ, అటవీ, ఉద్యానవన, వ్యవసాయ మార్కెటింగ్ తదితర శాఖలకు చెందిన ప్రగతిపై సమీక్షించారు. 5వ స్థాయీ సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన జంపు కన్నతల్లి మహిళా, శిశు అభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖల పనితీరును, ప్రగతిని సమీక్షించారు. సమావేశాలల్లో జెడ్పి సిఇఒ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఇఒ ఆర్,వెంకట్రామన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.